Saturday 26 October 2013

విభజనకు టీడీపీ వ్యతిరేకం కాదు: చంద్రబాబు

విభజనకు టీడీపీ వ్యతిరేకం కాదు: చంద్రబాబు

విభజనకు టీడీపీ వ్యతిరేకం కాదు: చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు టీడీపీ వ్యతిరేకం కాదని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మరోమారు స్పష్టంచేశారు. అయితే రాష్ట్రాన్ని విభజిస్తున్న తీరుకు తాము అభ్యంతరం చెప్తున్నామన్నారు. ఇరు ప్రాంతాలకు చెందినవారితో చర్చిం చాకే విభజన చేపట్టాలని తాము కోరుతున్నామన్నారు. ఆయన శుక్రవారం తన నివాసం లో మీడియాతో మాట్లాడారు. గతంలో ఆంధ్రప్రదేశ్  రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినపుడు తెలంగాణ, ఆంధ్రా ప్రాంత పెద్దలను కూర్చోబెట్టి కేంద్రం చర్చలు జరిపిందని,  ఇప్పుడలా ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు. తమిళనాడు, పంజాబ్‌లలో విద్వేషాలు రెచ్చగొట్టిన ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలను అవే బలి తీసుకున్నాయన్నది వాస్తవమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తనను ఎవరైనా చంపేస్తారేమోనని రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో శనివారం నుంచి తాను పర్యటించనున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నుంచి పర్యటన ప్రారంభించి రోజుకో జిల్లా వంతున ప్రకాశం జిల్లా వరకూ పర్యటిస్తారు.

 విలేకరుల సమావేశానికి ‘సాక్షి’ పత్రికను అనుమతించలేదు. వివిధ మార్గాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా వార్త ఇస్తున్నాం. ‘సాక్షి’ని ఆహ్వానించి ఉంటే బాబుకు ఈ కింది ప్రశ్నలు వేసి జవాబు అడిగేది.
 1.    తెలంగాణకు అనుకూలంగా 2008లో పార్టీ పొలిట్‌బ్యూరోలో తీర్మానం చేసి ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి లేఖ రాసినప్పుడు ఇరు ప్రాంతాల ప్రజలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఎందుకు కోరలేదు?
 2. గతేడాది డిసెంబర్ 28న కేంద్ర హోంమంత్రి షిండే నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి మీ పార్టీ ప్రతినిధులుగా హాజరైన కడియం శ్రీహరి, యనమల రామకృష్ణుడు తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామంటూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ సమయంలో రాష్ట్రాన్ని ఫలానా పద్ధతిలో విభజించాలని ఎందుకు కోరలేదు?
 3. సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న వెంటనే నూతన రాజధాని ఏర్పాటుకు రూ. నాలుగైదు లక్షల కోట్లు అవసరమని చెప్పి.. తర్వాత చాలా రోజులు మాట్లాడకుండా.. ఇప్పుడేమో ఇరు ప్రాంతాలతో చర్చించాలని కోరడమేంటి?

No comments:

Post a Comment